చిలకలూరిపేట - విమర్శల స్థానంలో భావోద్వేగాలు: మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశంలో కదిలించే దృశ్యాలు! రాజకీయాలకు అతీతంగా ఆత్మీయతలు.. ముగిసిన చిలకలూరిపేట కౌన్సిలర్ల పదవీకాలం!
చిలకలూరిపేట: నిన్నటి వరకు ప్రజా సమస్యలపై వాడివేడి చర్చలు... అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిన మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాలు సోమవారం భావోద్వేగాలకు వేదికైంది. ఐదేళ్ల సుదీర్ఘ మున్సిపల్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ సభ్యులు బరువెక్కిన గుండెలతో ఒకరికొకరు ఆత్మీయ వీడ్కోలు పలికారు. చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షతన జరిగిన ఈ చివరి అత్యవసర సమావేశంలో రాజకీయాలకు అతీతంగా ఆత్మీయతలు వెల్లివిరిశాయి.
రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ ఆలింగనం:
ఈ నెల 17తో కౌన్సిలర్ల పదవీకాలం ముగియనుండటంతో, రేపటి నుంచి తామంతా ఇలా ఒకేచోట కలిసే అవకాశం ఉండదన్న సత్యం సభ్యులను కలచివేసింది. పార్టీ సిద్ధాంతాలు, రాజకీయాలు పక్కనపెట్టి, ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ వీడ్కోలు చెప్పుకున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి.
కన్నీటి పర్యంతమైన కౌన్సిలర్లు:
ఈ ఐదేళ్ల కాలంలో ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు, సహకరించిన తోటి సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ టీడీపీ మహిళా కౌన్సిలర్ కన్నీటి పర్యంతమయ్యారు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో తమకు దక్కిన స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆమె ఉద్వేగంగా పేర్కొన్నారు.
పొరపాట్లు ఉంటే క్షమించండి - వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వర్లు
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల పట్ల గానీ, తోటి కౌన్సిలర్ల పట్ల గానీ తాను ఎప్పుడైనా దురుసుగా ప్రవర్తించి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వర్లు కోరారు. ఐదేళ్ల పాలనలో అడుగడుగునా సహకరించిన చైర్మన్ షేక్ రఫానికి, మున్సిపల్ అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధి పథంలో మన చిలకలూరిపేట - చైర్మన్ షేక్ రఫాని
గత ఐదేళ్లుగా కౌన్సిల్ సభ్యులంతా కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పనిచేశారని చైర్మన్ షేక్ రఫాని ప్రశంసించారు. తమ హయాంలో మున్సిపాలిటీని 'సెలెక్షన్ గ్రేడ్'గా తీర్చిదిద్దామని, త్యాగధనులు డాక్టర్ జాన్ డేవిడ్ సేవలకు గుర్తింపుగా ఒక ప్రధాన రహదారికి ఆయన పేరు పెట్టామని గుర్తుచేశారు. పట్టణంలో నీటి ఎద్దడి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
జ్ఞాపకాలను నెమరువేసుకున్న అధికారులు:
కేవలం కౌన్సిలర్లే కాకుండా, ఐదేళ్లుగా వారితో కలిసి పనిచేసిన మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు, డీఈఈ షేక్ అబ్దుల్ రహీం తమ అనుభవాలను పంచుకుంటూ కౌన్సిల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, మరికొందరు సభ్యులు వీధి కుక్కల నివారణ, తాగునీటి సమస్యలను ఈ చివరి సమావేశంలోనూ ప్రస్తావించడం వారి బాధ్యతకు అద్దం పట్టింది.
ఘన నివాళులు:
సమావేశం ప్రారంభంలో ఏఎంజీ వ్యవస్థాపకుడు డాక్టర్ జాన్ డేవిడ్ కుమార్తె పెర్సీ స్వరూప మృతి పట్ల సభ సంతాపం ప్రకటించింది. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.




