చిలకలూరిపేట - టెక్స్టైల్ పార్క్లో కలెక్టర్ కృత్తికా శుక్ల పర్యటన..టెక్స్టైల్ పార్క్ కష్టాలు ఇకనైనా తీరేనా ? వేలాది మందికి ఉపాధినిచ్చే ఇండస్ట్రీ.. ఎందుకు ఇలా అయింది?
స్థానిక టెక్స్టైల్ పార్క్ను జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల సందర్శించారు. పార్క్ షేర్ హోల్డర్స్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు విచ్చేసిన కలెక్టర్... అక్కడ కల్పించిన మౌలిక సదుపాయాలను పరిశీలించడంతో పాటు, టెక్స్టైల్, స్పిన్నింగ్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
41 ఎకరాల్లో అద్భుతమైన మౌలిక సదుపాయాలు
టెక్స్టైల్ పార్క్ను 41 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. సుమారు 6.5 లక్షల స్క్వేర్ ఫీట్ల నిర్మాణాలతో పాటు, డ్రైనేజీ వ్యవస్థ, ఫైర్ హైడ్రెంట్ లైన్స్, రోడ్లు వంటి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలను ఇక్కడ కల్పించారు.
సబ్సిడీల కోత.. విద్యుత్ ఛార్జీల మోత
కేంద్ర ఎంఎస్ఎంఈ (MSME) మినిస్ట్రీ అందించే 20% క్యాపిటల్ సబ్సిడీ, 10% టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ వస్తుందన్న ఆశతో పారిశ్రామికవేత్తలు సుమారు 30 నుంచి 40 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. కానీ, పైప్లైన్లో ఉండగానే కేంద్రం సబ్సిడీలను ఉపసంహరించుకోవడంతో పరిశ్రమలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయి.
దీనికి తోడు గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో ఈ పార్క్లకు సంబంధించి ఎటువంటి పారిశ్రామిక పాలసీ లేకపోవడం, విద్యుత్ టారిఫ్లు, డిస్కం లాసెస్ పేరుతో యూనిట్కు రూ. 3.50 పెంచడం పరిశ్రమల పాలిట శాపంగా మారింది. టెక్స్టైల్ ఇండస్ట్రీకి 50% నిర్వహణ వ్యయం విద్యుత్కే ఖర్చవుతుండటంతో.. స్పిన్నింగ్, వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్ సెక్టార్లన్నీ గత ఐదేళ్లుగా భారీగా దెబ్బతిన్నాయి.
ప్రభుత్వం ముందున్న ప్రధాన విజ్ఞప్తులు
ఈ సమస్యలన్నింటినీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన పార్క్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచారు:
- టెక్స్టైల్ ఇండస్ట్రీని 'పవర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ' (Power Intensive Industry)గా గుర్తించాలి.
- సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా 'రెన్యూవబుల్ గ్రీన్ ఎనర్జీ పాలసీ' కింద బ్యాంకింగ్ ఫెసిలిటీ కల్పించి, దానికి ఏడాది సెటిల్మెంట్ పీరియడ్ ఇవ్వాలి.
- గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సుమారు రూ. 500 కోట్ల సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలి.
మహిళా సాధికారతకు, ఉపాధికి పెద్దపీట
ప్రస్తుతం ఈ పార్క్లో కేవలం 10 శాతం యూనిట్లు మాత్రమే ఆపరేషన్లో ఉన్నాయి. ఇందులో సుమారు 250 నుంచి 300 మంది (అధిక శాతం స్థానికులు) ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించి, గార్మెంట్ పరిశ్రమలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. సుమారు 2000 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. తద్వారా ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో నాలుగు రెట్ల ఆదాయం సమకూరుతుంది.
పార్క్ ప్రతినిధులు వివరించిన ఈ సమస్యలన్నింటిపై కలెక్టర్ కృత్తికా శుక్ల సానుకూలంగా స్పందించారు. ఈ ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన ప్రభుత్వం సానుకూల నిర్ణయాలతో టెక్స్టైల్ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకువస్తుందని పారిశ్రామికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు




