💰 మహిళా సాధికారతే లక్ష్యం.. 17న నరసరావుపేటకు సీఎం, కేంద్ర మంత్రి!
డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ఈ నెల 17న నరసరావుపేటలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న 'క్రెడిట్ అవుట్ రీచ్' రుణ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రత్తిపాటి తన క్యాంపు కార్యాలయంలో వివిధ క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సైతం ఫోన్ ద్వారా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీ రుణాలు, బీమా పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, ఓటర్ల జాబితా సవరణ (సర్) పై నాయకులు అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదని ప్రత్తిపాటి సూచించారు.
🟡 చిలకలూరిపేటలో కొనసాగుతున్న వలసలు.. టీడీపీ గూటికి మురికిపూడి వైసీపీ శ్రేణులు!
వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు, ఆ పార్టీ అధినేత దిగజారుడు రాజకీయాలతో విసిగిపోయిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నారు. తాజాగా చిలకలూరిపేట మండలం మురికిపూడికి చెందిన సుమారు 50 వైసీపీ కుటుంబాలు (చెంబేటి కుటుంబ సభ్యులు, వడ్డెరలు) ఎమ్మెల్యే ప్రత్తిపాటి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. పార్టీలోకి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించిన ప్రత్తిపాటి, కూటమి ప్రభుత్వంలో ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ ఆడక స్వాములు, షేక్ కరిముల్లా తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.




