రక్షకుడే భక్షకుడయ్యాడు: సస్పెండైన సీఐ కీచక పర్వం - న్యాయం కోసం బాధితురాలి కన్నీటి పోరాటం!
చిలకలూరిపేట/వినుకొండ: కంచే చేను మేసిన చందంగా... ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన ఓ వ్యక్తి, ఓ అబల పట్ల కీచకుడిగా మారాడు. సస్పెన్షన్లో ఉన్నప్పటికీ తన పాత దర్పాన్ని, పోలీసు పలుకుబడిని ఉపయోగించి అమానుషంగా ప్రవర్తించిన ఈ ఘటన పల్నాడు జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. చిలకలూరిపేట పట్టణంలో బాధితురాలు ధనలక్ష్మి మీడియాతో తన గోడు వెళ్లబోసుకోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే...
వినుకొండ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ధనలక్ష్మి తన కుటుంబంతో కలిసి గత ఐదు నెలలుగా ఓ ఇంటిని లీజుకు తీసుకుని నివాసం ఉంటోంది. అదే ఇంట్లో నిందితుడు, సస్పెండైన సీఐ సి.హెచ్. చిన్న మల్లయ్య కూడా ఉంటున్నాడు. గతంలో విధి నిర్వహణలో ఉన్నప్పుడు కేవలం శని, ఆదివారాలు మాత్రమే అక్కడ బస చేసే సదరు సీఐ... ఇటీవల సస్పెండ్ అయినప్పటి నుండి పూర్తిగా అక్కడే మకాం వేశాడు.
ఒంటరిగా ఉన్న సమయం చూసి అఘాయిత్యం:
ఒకరోజు ఉదయం ధనలక్ష్మి భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన విషయాన్ని గమనించిన చిన్న మల్లయ్య, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి గదిలోకి చొరబడ్డాడు. లోపల నుండి గదికి గడియ పెట్టి ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. తాను ఎంతలా ప్రాధేయపడినా, తీవ్రంగా ప్రతిఘటించినా కనికరించకుండా దారుణంగా వ్యవహరించాడని బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది.
చంపేస్తామంటూ కొడుకుతో కలిసి బెదిరింపులు:
తన కామవాంఛ తీరకపోవడంతో, ఈ దారుణాన్ని బయటకు చెబితే ప్రాణాలతో వదిలిపెట్టనని ఆ మాజీ సీఐ బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా తన కొడుకును కూడా రంగంలోకి దించి, సందేశాల ద్వారా బాధితురాలికి, ఆమె కుటుంబానికి నిరంతరం బెదిరింపులు పంపిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు. పోలీసుల బ్యాక్గ్రౌండ్ తో తమను ఏమైనా చేస్తారేమోనని ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది.
సీఎం చంద్రబాబుకు బాధితురాలి విజ్ఞప్తి:
"ఒక బాధ్యతాయుతమైన పోలీసు పదవిలో పనిచేసిన వ్యక్తి ఇలాంటి నీచానికి ఒడిగట్టడం దారుణం. మాకు స్థానికంగా రక్షణ కరువైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి మరియు పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే ఈ ఘటనపై స్పందించాలి. నిందితుడైన సీఐ చిన్న మల్లయ్యపై కఠిన చర్యలు తీసుకుని, నా కుటుంబానికి రక్షణ కల్పించి మాకు న్యాయం చేయాలి" అని ధనలక్ష్మి వేడుకుంది.




