భావితరాలకు వెలుగునిద్దాం - ఇంధనం పొదుపు చేద్దాం: చిలకలూరిపేటలో ఘనంగా విద్యుత్ పొదుపు వారోత్సవాల ర్యాలీ
చిలకలూరిపేట స్పీడ్ న్యూస్:
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను పురస్కరించుకుని చిలకలూరిపేట డివిజన్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. "ఇంధనం పొదుపు చేద్దాం - భావితరాలకు వెలుగునిద్దాం" అనే నినాదంతో జరిగిన ఈ ర్యాలీని ఈఆర్వో (ERO) ఆఫీసు నుండి గడియార స్తంభం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వై. ఏడుకొండలు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. అశోక్ కుమార్, ఏఈలు మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
డిసెంబర్ 14 నుండి 20 వరకు జరుగుతున్న ఈ వారోత్సవాల్లో భాగంగా, విద్యుత్ పొదుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఈఈ వై. ఏడుకొండలు గారు మాట్లాడుతూ విద్యుత్ ఆదా చేయడానికి ప్రజలకు పలు సూచనలు చేశారు.
విద్యుత్ పొదుపు కోసం 4 ముఖ్య సూత్రాలు:
అనవసర వినియోగం వద్దు: గదుల్లో ఎవరు లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
స్టార్ రేటింగ్: విద్యుత్ పరికరాలు (AC, Fridge వంటివి) కొనుగోలు చేసేటప్పుడు 3 కంటే ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్నవాటిని ఎంచుకోవడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది.
సోలార్ వినియోగం: గీజర్లు, వాటర్ మోటార్లకు సోలార్ విద్యుత్ వాడటం ద్వారా కరెంట్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చు.
ప్లగ్ ఆఫ్ చేయాలి: టీవీలు, మొబైల్ ఛార్జర్లు వాడకం అయిపోయాక కేవలం రిమోట్ ద్వారా లేదా పిన్ తీసి కాకుండా, మెయిన్ స్విచ్ కూడా ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చు.
ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన:
తరిగిపోతున్న సహజ వనరులను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద లభించే రాయితీని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ వైపు మొగ్గు చూపాలని అధికారులు కోరారు.
చిలకలూరిపేట సోలార్ కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి 80743 00423
స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు:
స్మార్ట్ సిటీ కింద ఎంపికైన చిలకలూరిపేటలో విద్యుత్ శాఖ సిబ్బంది స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు. దీనివల్ల బిల్లులు ఎక్కువగా వస్తాయనే ప్రచారంలో నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు www.apcpdcl.in సైట్ లేదా యాప్ ద్వారా తమ రోజువారీ విద్యుత్ వినియోగాన్ని స్వయంగా పరిశీలించుకోవచ్చని తెలిపారు.
విద్యుత్ వినియోగదారులకు సువర్ణావకాశం (50% రాయితీ):
ఇళ్లలో విద్యుత్ లోడ్ (Load) పెంచుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. అదనపు లోడ్ రెగ్యులరైజేషన్ కోసం చెల్లించాల్సిన డెవలప్మెంట్ చార్జీలలో 50% రాయితీ ప్రకటించారు.
గడువు: ఈ ఆఫర్ డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మీరు తీసుకున్న లోడ్ కంటే ఎక్కువ వాడుతున్నట్లయితే, వెంటనే దగ్గరలోని విద్యుత్ రెవిన్యూ కార్యాలయాన్ని సంప్రదించి, రాయితీతో లోడును క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.
వోల్టేజ్ సమస్యలు, స్తంభాలు లేదా లైన్లకు సంబంధించిన సమస్యలు ఉంటే సంబంధిత ఏఈలను సంప్రదించాలని, సలహాలు లేదా సూచనల కోసం టిడ్కో గృహాల వద్ద ఉన్న కార్యాలయంలో తనను నేరుగా కలవవచ్చని ఈఈ వై. ఏడుకొండలు తెలిపారు.





