చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల నరకయాతన - సిబ్బంది నిర్లక్ష్యానికి బలి అవుతున్న పేదలు! - ఎమ్మెల్యే పుల్లారావు శ్రమకు సిబ్బంది తూట్లు
చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): పేదవాడికి ప్రాణదాతగా నిలవాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి.. ఇప్పుడు సిబ్బంది నిర్లక్ష్యానికి, చిరాకులకు కేరాఫ్ అడ్రస్గా మారింది. స్థానిక మద్దినగర్లోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్న రోగులు.. రోగం కన్నా సిబ్బంది పెడుతున్న నరకంతోనే ఎక్కువగా విలవిలలాడుతున్నారు.
"మాకు టైమ్ లేదు.. పక్కకు పోండి..!"
ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేలు, లక్షలు ఖర్చుపెట్టుకోలేని నిరుపేదలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. కానీ, ఇక్కడి సిబ్బంది తీరు చూస్తే పేదలకు కన్నీళ్లు ఆగడం లేదు. రోగులకు ధైర్యం చెప్పాల్సిన సిబ్బందే.. వారిపై కసురుకుంటున్నారు. కనీసం తమ బాధ చెప్పుకుందామన్నా.. "మాకు టైమ్ లేదు", "పక్కన కూర్చోండి", "ఎక్కువ మాట్లాడకండి" అంటూ ఈసడించుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్-పేషెంట్ వార్డుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఏదైనా అత్యవసరమై పిలిచినా, ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా సిబ్బంది కుర్చీలు వదిలి రావడం లేదనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సిస్టమ్స్ డౌన్.. ఓపీల కోసం నరకం..
ఒకవైపు సిబ్బంది కొరత, మరోవైపు ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం వెరసి రోగులకు ఓపీ (OP) చిట్టీ దొరకడమే గగనంగా మారింది. రిసెప్షన్లో ఉన్న కంప్యూటర్లు తరచూ పనిచేయకపోవడంతో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. ఉదయం 8 గంటలకు వస్తే, మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఓపీ రాయకపోవడంతో మారుమూల పల్లెల నుంచి పసిపిల్లలతో వచ్చే తల్లులు, వృద్ధులు ఆసుపత్రి వరండాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. సిస్టమ్స్ పనిచేయనప్పుడు ప్రత్యామ్నాయంగా మాన్యువల్ పద్ధతిలో ఓపీ రాసి పంపాలనే కనీస ఇంగితం కూడా అధికారులు ప్రదర్శించడం లేదు.
ఎమ్మెల్యే కృషి బూడిదలో పోసిన పన్నీరేనా?
ప్రజలకు మెరుగైన వైద్యం అందాలన్న సదుద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, దీనిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. ఆధునిక వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించారు. కానీ "ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్" అన్నట్లుగా.. కోట్లు ఖర్చుపెట్టి భవనాలు, సదుపాయాలు తెచ్చినా ఇక్కడి సిబ్బంది వ్యవహారశైలితో ఆ ఫలాలు ఏమాత్రం పేదలకు అందడం లేదు.
వీడియో కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి.
https://www.instagram.com/reel/DWON_nxCcxi/?igsh=MW5yN2ZjaTdxM2NjOA==
అధికారులు స్పందించేదెన్నడు?
ఈ ఆసుపత్రిలో జరుగుతున్న నిర్వాకంపై జిల్లా ఉన్నతాధికారులు (DMHO), కలెక్టర్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి బాగుపడేలా లేదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.




