చిలకలూరిపేటలో ఎప్పుడు లేని విధంగా వినూత్న ప్రయోగం..వాహనదారులకు ఉపశమనం కల్పిస్తున్న మున్సిపాలిటీ
చిలకలూరిపేట పట్టణంలో ఎండలు దడపుట్టిస్తున్నాయి. ఎండ వేడిమికి తోడు ట్రాఫిక్లో చిక్కుకునే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చిలకలూరిపేట మున్సిపాలిటీ వాహనదారులకు మరియు ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ప్రధాన కూడలి అయిన ఎన్ఆర్టీ (NRT) సెంటర్ వద్ద ట్రాఫిక్ జామ్లో ఇరుక్కునే వాహనదారులకు ఎండ తగలకుండా సుమారు 40 నుంచి 50 అడుగుల మేర రోడ్డుకు ఇరువైపులా భారీ గ్రీన్ మ్యాట్లను (చలువ పందిళ్లు) ఏర్పాటు చేశారు. ఈ గ్రీన్ మ్యాట్ల వల్ల ఎండ తీవ్రత తగ్గి, వాహనదారులకు భారీ ఉపశమనం లభిస్తోంది.
అన్నా క్యాంటీన్లు మరియు ఇతర ప్రాంతాల్లోనూ..
కేవలం ఎన్ఆర్టీ సెంటర్ మాత్రమే కాకుండా, పట్టణంలోని మూడు అన్నా క్యాంటీన్ల పరిసరాల్లోనూ సామాన్య ప్రజలకు ఎండ వేడిమి తగలకుండా గ్రీన్ మ్యాట్లను మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నేడు పురుషోత్తపట్నం అడ్డరోడ్డు సెంటర్లో కూడా రోడ్డుకు ఇరువైపులా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలు:
ప్రజల దాహార్తిని తీర్చేందుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో చల్లటి మంచినీరు మరియు మజ్జిగ చలివేంద్రాలను సైతం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు, వాహనదారులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.




