పలానాడు - కోటప్పకొండలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భారీ శిక్షణా శిబిరం - ప్రజాస్వామ్య రక్షణలో యువతదే కీలకపాత్ర: ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకుల పిలుపు
పల్నాడు (కోటప్పకొండ):చారిత్రక నేపథ్యం ఉన్న పల్నాడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ వేదికగా అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు జరగనున్నాయి. జూన్ 1 నుండి 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు "యువజన విద్యా, సిద్ధాంతిక, సాంస్కృతిక శిక్షణ తరగతులు" అట్టహాసంగా నిర్వహించేందుకు ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా సమితి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం కోటప్పకొండలో పల్నాడు జిల్లా ముఖ్య నాయకులతో కలిసి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన సంఘం కరపత్రాలను ఘనంగా విడుదల చేశారు.
ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. సంతోష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఎం. యుగంధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రస్తుత దేశ రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో యువత పాత్ర అత్యంత కీలకమని, వారు ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (NDA) ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ, రాష్ట్రాల హక్కులను నిర్లక్ష్యం చేస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు.
నిరుద్యోగంపై పోరాటమే లక్ష్యం:
దేశంలో నిరుద్యోగ సమస్య మునుపెన్నడూ లేని విధంగా ఒక తీవ్రమైన సంక్షోభంగా మారిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నాయని మండిపడ్డారు. ఒకపక్క ప్రైవేటీకరణ పేరుతో శాశ్వత ఉద్యోగాలను నిర్వీర్యం చేస్తూ, మరోపక్క కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాలతో యువత శ్రమను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్యలు అభ్యసించిన యువత భవిష్యత్తు ప్రస్తుతం అంధకారంలో పడిందని విచారం వ్యక్తం చేశారు.
నాయకత్వ లక్షణాలను పెంపొందించే వేదిక:
సీపీఐ జిల్లా కార్యదర్శి, యువజన మాజీ రాష్ట్ర నాయకులు ఏ. మారుతి వరప్రసాద్, తాళ్లూరి బాబురావు మాట్లాడుతూ... కోటప్పకొండలో జరగనున్న ఈ ఐదు రోజుల శిక్షణా తరగతులు కేవలం రాజకీయ సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కావని స్పష్టం చేశారు. ప్రస్తుత సమాజంలోని సామాజిక రుగ్మతలు, నిరుద్యోగ సమస్యలు, విద్యా రంగంలో వస్తున్న పెను మార్పులు, సామాజిక న్యాయం, సాంస్కృతిక విలువల పరిరక్షణ వంటి కీలక అంశాలపై మేధావులు, ప్రముఖ నాయకులతో బోధనలు ఉంటాయన్నారు. యువత తమ హక్కుల సాధన కోసం ఎలా ఉద్యమించాలి, ప్రజా సమస్యల పట్ల ఎలా స్పందించాలి అనే విషయాలపై ఈ శిబిరం ద్వారా స్పష్టమైన దిశానిర్దేశం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి యువతీయువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ధనరాజ్, ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, నాయకులు మల్లికార్జున, పత్తిపాటి నాగరాజు, మరియబాబు, ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మేకపోతుల నాగేశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.





No comments:
Post a Comment