చిలకలూరిపేట - యడ్లపాడులో ఘోర విషాదం..సరదాగా చేపలు పడదామని వెళ్లి..అనంతలోకాలకు.. ఇద్దరు విద్యార్థుల మృతి!
చిలకలూరిపేట స్పీడ్ న్యూస్: పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడపాల్సిన వారాంతం ఆ రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. జగ్గాపురం రోడ్డు సమీపంలోని చవిటి చెరువులో (మంచినీళ్ల చెరువు) ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఎడ్లపాడుకు చెందిన షేక్ అముల్లా (12), షేక్ మొహమ్మద్ అహ్మద్ (17)గా పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే?
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడ్లపాడుకు చెందిన మస్తాన్ కుమారుడు షేక్ అముల్లా (7వ తరగతి), ప్రస్తుతం ఎడ్లపాడులో నివాసముంటున్న బోయపాలెంకు చెందిన ఇమాంస్ కుమారుడు షేక్ మొహమ్మద్ అహ్మద్ (ఇంటర్ ప్రథమ సంవత్సరం) స్నేహితులు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వీరు ఆడుకోవడానికి అని ఇంటి నుండి బయటకు వెళ్లారు. సాయంత్రం చీకటి పడుతున్నా పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించడం ప్రారంభించారు.
గట్టుపై లభించిన ఆధారాలు.. గుండె పగిలే నిజాలు
గాలింపు చర్యల్లో భాగంగా జగ్గాపురం రోడ్డులోని చెరువు గట్టు వద్ద అముల్లా సైకిల్, దుస్తులు, చెప్పులు కనిపించాయి. అక్కడే అహ్మద్ చెప్పులు కూడా లభించడంతో వారు చెరువులోకి దిగి ప్రమాదానికి గురై ఉంటారని బంధువులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ, గ్రామస్థుల సాయంతో చెరువులో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సుమారు 30 అడుగుల మేర లోతు ఉన్న ఆ చెరువులో స్థానికులు నాటు పడవలు, బొంగు కర్రల సాయంతో గాలించగా, ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారంతా కన్నీరుమున్నీరయ్యారు.
ప్రాణాలు తీసిన చేపల వేట
సంఘటనా స్థలాన్ని పోలీసులు నిశితంగా పరిశీలించగా, గట్టు వద్ద ఒక చిన్న కర్రకు గాలం కట్టి ఉండటాన్ని గుర్తించారు. దీన్ని బట్టి విద్యార్థులు ఇద్దరూ సరదాగా చేపలు పట్టేందుకు ప్రయత్నించి, లోతు అంచనా వేయలేక కాలు జారి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు
చేతికొచ్చిన పిల్లలు, అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారులు విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారి ఆక్రందనలు చూసి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్పీడ్ న్యూస్ విజ్ఞప్తి: పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సెలవు దినాల్లో వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దానిపై ఓ కన్నేసి ఉంచాలి. చెరువులు, కుంటల వద్దకు పిల్లలను ఒంటరిగా వెళ్లనివ్వకండి.
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.





No comments:
Post a Comment