చిలకలూరిపేట - అటు పంచాయతీ లేదు.. ఇటు మున్సిపాలిటీ కాదు.. ఈ ఊరి పాపం ఏంటి? గ్రామమా? వార్డా? తేలని సందిగ్ధత.. వ్యవస్థల మధ్య నలిగిపోతున్న ఆ ఊరి ప్రజలు!
అటు పంచాయతీ కాక.. ఇటు మున్సిపాలిటీలో కలవక.. రెంటికీ చెడ్డ రేవడిలా 'మానుకొండవారిపాలెం'..! 💔
అభివృద్ధికి ఆమడదూరంలో విలీన గ్రామాలు.. నెత్తురోడుతున్న రహదారులు!
చిలకలూరిపేట రూరల్ పరిధిలోని మానుకొండవారిపాలెం గ్రామం పరిస్థితి ఇప్పుడు వర్ణనాతీతంగా మారింది. పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం దశాబ్దాల వెనకబడిపోయింది. అటు పంచాయతీ పాలన లేక, ఇటు మున్సిపాలిటీలో కలవక.. ఐదేళ్లుగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఈ గ్రామ ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఈ ఊరి పరిస్థితి చూస్తే.. వ్యవస్థల మధ్య నలిగిపోతున్న సామాన్యుడి కష్టం కళ్లకు కడుతుంది!
🛑 మురిసిన ఆనందం.. మూన్నాళ్ల ముచ్చటే!
2020 జనవరిలో చిలకలూరిపేట మున్సిపాలిటీలో గణపవరం, మానుకొండవారిపాలెం, పసుమర్రు, దండమూడి గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం జీవోలు (G.O 83, 260) జారీ చేసింది. మున్సిపాలిటీలో కలిస్తే తమ గ్రామం కూడా సిటీలా డెవలప్ అవుతుందని, మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని మానుకొండవారిపాలెం వాసులు ఎంతో సంబరపడ్డారు. కానీ ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయని కొందరు కోర్టును ఆశ్రయించి స్టే తేవడంతో.. ఆ గ్రామాల ఆనందం ఆవిరైపోయింది.
⚖️ నాథుడు లేని ఊరు.. ఐదేళ్లుగా అదే తీరు!
కోర్టు స్టే కారణంగా.. అటు మున్సిపల్ ఎన్నికలు జరగలేదు, ఇటు పంచాయతీ ఎన్నికలూ నిర్వహించలేదు. ఫలితంగా ఈ నాలుగు గ్రామాలకు సర్పంచులు, వార్డు మెంబర్లు లాంటి ప్రజాప్రతినిధులు లేకుండా పోయారు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నిధుల రాక నిలిచిపోయింది. కనీసం వీధిలైట్లు, డ్రైనేజీలు, రోడ్లు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. "మా గోడు ఎవరికి చెప్పుకోవాలి?" అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
⚠️ ప్రాణాలు తీస్తున్న 'దండమూడి - మానుకొండవారిపాలెం' రహదారి! 🚑
అభివృద్ధి లేకపోవడం ఒక ఎత్తు అయితే.. ఊరికి వెళ్లే దారి ప్రాణసంకటంగా మారడం మరో ఎత్తు. దండమూడి నుండి మానుకొండవారిపాలెం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ రోడ్డు ఉందో తెలియని భయానక పరిస్థితి.
- రాత్రి వేళ నరకం: చీకటి పడిందంటే చాలు.. ఈ దారిలో ప్రయాణించాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.
- ఆసుపత్రి పాలవుతున్న యువకులు: ద్విచక్ర వాహనాలపై వెళ్లే యువకులు ఈ గుంతల రోడ్డులో స్కిడ్ అయ్యి, కాళ్లు చేతులు విరగ్గొట్టుకుని ఆసుపత్రుల పాలైన ఘటనలు కోకొల్లలు. అత్యవసర పరిస్థితి వస్తే అంబులెన్స్ కూడా రాలేని దుస్థితిలో ఈ రోడ్డు ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
📉 నిధులు నిల్.. కన్నీళ్లే మిగిలాయి!
చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి పాయలో దూసుకుపోతుంటే, మానుకొండవారిపాలెం మాత్రం అనాథలా మిగిలిపోయింది. "మా గ్రామ అభివృద్ధి పట్ల మేం అందరికన్నా వెనుకబడిపోయాం. కనీస సదుపాయాలు లేక నరకం అనుభవిస్తున్నాం" అని గ్రామస్తులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏళ్ల తరబడి నెలకొన్న ఈ సందిగ్ధతకు ముగింపు పలకాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
🗣️ అధికారులూ.. ఇకనైనా స్పందించండి!
ఈ రోజు ఆ ఊరిలోకి అడుగుపెడితేనే వారి దీనస్థితి మనకు అర్థమవుతుంది. ఇంకెంత కాలం ఈ చట్టపరమైన చిక్కుల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతారు? తక్షణమే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి విలీన జీవోల సమస్యను కొలిక్కి తేవాలి. లేదంటే కనీసం ఆ దండమూడి-మానుకొండవారిపాలెం రోడ్డుకైనా మరమ్మతులు చేపట్టి ప్రాణాలు నిలపాలని 'చిలకలూరిపేట స్పీడ్ న్యూస్' డిమాండ్ చేస్తోంది! 🎤 దృశ్యాలు మారుతున్నా.. వీరి తలరాతలు మారేది ఎప్పుడో?!




